గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) రూపమున మనలను మన అమ్మ కరుణింపనున్నది.
సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.

ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.
మీకు సర్వశ్రేయములను ఈ అమ్మ చేకూర్చునుగాక.
సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని )
శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
మాలినీ వృత్తము గర్భ సీసము. (మాలిని వృత్తము. - న న మ య య .. యతి 9)
వినయ మొసగెదవీవే నాకిలన్ సిద్ధి దాత్రీ! పరాత్పరి దారి నీవె.
విజయ విభవములీవే సత్య సంపూర్ణ తేజా! మదిన్ నిల్పి పూజ సేతు.
సదయ నిలుము మనోజ్ఞా! దర్ప సన్మూల నాశా! మహేశాని! నాదు మదిని.
విలయ మగునెడ నీవే రక్ష నాకున్. మ దంబా! నిరంజనా! హరుని రాణి.
తే.గీ. కార్య సిద్ధిని కలిగించు  కామితప్రద!
సౌర్య సద్గుణ సంపద్విశారదులుగ
సజ్జనంబులఁ గాచుచు సదయఁ గనుమ!
వందనంబులునీకునానందపూర్ణ!
సీస గర్భస్థ మాలినీ వృత్తము . (న న మ య య .. యతి 9)
నయ మొసగెదవీవే నాకిలన్ సిద్ధి దాత్రీ
జయ విభవములీవే సత్య సంపూర్ణ తేజా!! .
దయ నిలుము మనోజ్ఞా! దర్ప సన్మూల నాశా
లయ మగునెడ నీవే రక్ష నాకున్. మ దంబా!
నైవేద్యం : పాయసాన్నము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మహిషాసుర మర్దినిపైన కవితాదులు అద్భుతముగా నున్నవి . కలం దించకుండా రాత్రికి రాత్రి శతకములను రచించగల సోదరునికి గర్భకవితలు అవలీలగ వ్రాయగలగడం ఆదేవి కృప. దీవించి అక్క.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.